పళనిసామి సర్కారుకు తలనొప్పి.. విజయభాస్కర్ ఇంట్లో దొరికిన ఒక్క కాగితం.. కొంపముంచిందా?

తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామికి కొత్త తలనొప్పి వచ్చింది. ఎడప్పాడి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకు ఆయన సర్కారును ఇరకాటంలో పెట్టేందుకు పన్నీర్ సెల్వం వర్గం, ప్రతిపక్షాలు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఆర్కే నగర్ ఉప ఎన్నికలు రద్దు కావడంతో తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
తమిళనాడులో ఆదాయపన్ను శాఖ దాడుల్లో లభించిన ఆధారాలు, రికార్డులు, పత్రాలు స్వాధీనం చేసుకున్న ఐటీ శాఖ అధికారులు దూకుడు పెంచారు. దీనికి సంబంధించిన నివేదిక ఆధారాలు ఎన్నికల సంఘానికి అందడంతోనే ఆర్కే నగర్ ఎన్నికలను రద్దు చేసినట్లు సమాచారం. తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ సమతువ మక్కల్ కట్చి (ఎస్ఎంకే) పార్టీ వ్యవస్థాపకుడు, బహుబాష నటుడు శరత్ కుమార్, ఎంజీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి గీతా లక్ష్మీలకు ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది.
మంత్రి విజయభాస్కర్ ఇంటిలో భారీ మొత్తంలో నగదు, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈ సోదాల్లో ఓ కాగితం మాత్రం ఐటీ శాఖ అధికారులకు చిక్కడమే.. సీఎం పళనిస్వామికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఆ కాగితంలో ఆర్కేనగర్‌లో పార్టీ నేతలు, మంత్రులు ఎవరెవరు ఓటర్లకు ఎన్ని కోట్ల రూపాయలు పంచిపెట్టాలనే పూర్తి వివరాలు ఉన్నాయని.. ఈ పేపర్ ఆధారమే ఎడప్పాడికి చిక్కులు కొనితెచ్చిపెట్టిందని వార్తలు వస్తున్నాయి.
ఎస్ఎంకే పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు శరత్ కుమార్.. ఆర్ కే నగర్‌లో శశికళ వర్గం నుంచి పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్‌కు మద్దతు ప్రకటించిన మరుసటి రోజే ఆయన ఇంటిపై ఐటీ శాఖ దాడులు జరిగాయి. శరత్ కుమార్ ఇంటిలో కొన్ని లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. శరత్ కుమార్‌ను విచారించి పూర్తి వివరాలు సేకరించాలని ఐటీ శాఖ అధికారులు నిర్ణయించారని సమాచారం. ఐటీ శాఖ దూకుడును పెంచడంతో పళనిసామి సర్కారుకు ఇబ్బందులు తప్పవని.. వారి మంత్రులకు కష్టాలు తప్పవని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *