పవన్ లో నిలకడ లేదన్న: రోజా
ఏపీ విపక్ష ఎమ్మెల్యే రోజా ఎంతటి ఫైర్ బ్రాండో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మాటలతో మంట పుట్టించే ఆమె.. ఎవరిని టార్గెట్ చేసినా దుమ్ము దులిపేస్తుంటారు. తన పార్టీకి మినహా మరెవరినీ మాట వరసకు పాజిటివ్ గా మాట్లాడని లక్షణం ఉన్న రోజా తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. రోజాలో ఉన్న మరో ఆసక్తికోణం ఏమిటంటే.. ఆమె రాజకీయాల్ని ఎక్కడపడితే అక్కడ చేసేస్తుంటారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు వచ్చే ప్రముఖులు ఎవరూ.. రాజకీయాల గురించి పెద్దగా పెదవి విప్పరు.
ఒకవేళ మీడియా ప్రతినిధులు అత్యుత్సాహంతో ఏదైనా ప్రశ్నలు వేసినా.. కొండ మీద ఉన్నానని.. పుణ్యక్షేత్రంలో రాజకీయాలు వద్దంటూ ఉత్సాహం మీద నీళ్లు చల్లుతుంటారు. కానీ.. రోజా స్టైల్ అలా ఉండదు. తన దగ్గరకు వచ్చిన మీడియా మైకుల్ని చూడగానే ఆమె చెలరేగిపోతారు. ఇక.. మీడియా ప్రతినిధుల నోటి నుంచి రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న వస్తే.. ఆమె నోటి వెంట తూటాల్లాంటి మాటలు వస్తుంటాయి.
తాజాగా పవన్ కల్యాణ్ మీద మండిపడ్డారు రోజా. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులపై పవన్ ఇచ్చిన అల్టిమేటాన్ని తేలిగ్గా కొట్టేశారు. ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పటి నుంచీ పవన్ ఇస్తున్న వాగ్ధానాలు.. హామీల్లో చాలా మార్పుఉందని.. ఆయనలో నిలకడ లేకుండా వ్యవహరిస్తారంటూ విమర్శించారు. ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నిస్తారంటే నమ్మే స్థితిలో ఏపీ ప్రజలు లేరన్న రోజా.. పవన్ ను నమ్మలేమని తేల్చేశారు.