రూ.లక్ష బహుమతి; సాఫ్ట్వేర్ డెవలప్ కి సిటీ పోలీసుల సహకారం
పెరుగుతున్న సైబర్ క్రైమ్, ఇతర నేరాల నియంత్రణ కోసం ఐటీ విద్యార్థులతో హైదరాబాద్ పోలీసులు హాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూసఫ్గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో హ్యకథాన్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, షీ టీమ్స్ అదనపు సీపీ శిఖ గోయల్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టెక్నాలజీ వినియోగంలో తాము వినూత్న ప్రయోగం చేస్తున్నామని 36 గంటల పాటు హాకథాన్ సాగింది. ఐటీ, ఇంజనీరింగ్ విద్యార్థుల భాగస్వామ్యంతో పోలీసులు కొత్త సాఫ్ట్వేర్స్, యాప్స్, రూపకల్పన చేయనున్నారు. నేరాల నియంత్రణకు సరికొత్త యాప్స్, సాఫ్ట్వేర్ సృష్టించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. ఈ హాకథాన్లో 60 కాలేజీలకు చెందిన విద్యార్థులు, 10 స్టార్టప్ కంపెనీలు, 5 ఎంఎన్సీలు, ముంబయి, బెంగళూరుకు ఐటీ నిపుణులు పాల్గొన్నారు. బెస్ట్ ఐడియా, యాప్స్ తయారు చేసిన వారికి రూ.లక్ష బహుమతి, సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి సిటీ పోలీసుల సహకారం ఉండనుంది. కార్యక్రమంలో నగర కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో టెక్నికల్ హ్యకథాన్ కార్యక్రమం మొదటి సారి నిర్వహిస్తున్నామని చెప్పారు. 36 గంటల పాటు ఈ హ్యకథాన్ కార్యక్రమం ఉంటుందని, కొత్త ఆలోచనలు సృష్టించడంలో ఎప్పుడూ యువత ముందు ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాక, టెక్నాలజీ వాడకంలో హైదరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందు ఉంటారని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డ అనంతరం, టెక్నాలజీ విషయంలో పోలీస్ శాఖకు ఎన్నో అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం మారిపోతుంది. నేరం జరిగే ముందే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేరాన్ని పసిగట్టి దాన్ని ఆపేలా ప్రయత్నించే కొత్త టెక్నాలజీల కోసం అన్వేషిస్తున్నాం. నేరాన్ని కనుగొనడం మాత్రమే కాదు అది జరగకుండా చూసుకోవడం కూడా పోలీసుల లక్ష్యం. రానున్న 2-3 సంవత్సరాల్లో ఇలాంటి సాంకేతికతను తీసుకొస్తాం’’అని కమిషనర్ అన్నారు.