శశికళకు రెండు దిమ్మతిరిగే షాక్లు…
తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ తమిళ సీఎం పీఠం కోసం వేస్తోన్న ఎత్తులు కొనసాగుతుండగానే ఇప్పుడు చిన్నమ్మకు రెండు దిమ్మతిరిగే షాక్లు తగిలాయి. చిన్నమ్మ పోటీ చేయాలనుకుంటోన్న జయ నియోజకవర్గం ఆర్కె.నగర్ నియోజకవర్గంలో శశికళకు తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. ఆమె తమ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఓట్లు వేయమని వాళ్లు శశిపై ఫైర్ అవుతున్నారు.
ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేసేవారు. అక్కడి ప్రజలకు జయమ్మ అంటే ఎక్కడ లేని అభిమానం. జయ చనిపోవడంతో ఇప్పుడు సీఎం అవ్వాలనుకుంటున్న చిన్నమ్మ శశికళ అక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే అక్కడి ప్రజలు మాత్రం తాము ఎంతగానో అభిమానించే జయ 77 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందితే తమకు ఒక్క రోజు కూడా చూపించలేదని వారు శశికళపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్కె.నగర్ నియోజకవర్గం నుంచి జయ మేనకోడలు దీపా జయకుమార్ మాత్రమే ఇక్కడ పోటీ చేస్తే తాము ఓట్లు వేసి గెలిపిస్తామని వారంటున్నారు. జయ వారసత్వాన్ని ఆమె మేనకోడలు దీపా మాత్రమే కొనసాగించాలని… శశికళ నాయకత్వాన్ని మాత్రం తాము ఆమోదించేది లేదని నియోజకవర్గంలో చాలా గ్రూపులు తెగేసి చెపుతున్నారు.
శశికళ ఇంటర్నల్గా చేయించుకున్న సర్వేలో కూడా ఇక్కడ ఆమెకు వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో మధురై నియోజవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా ఇప్పటికే శశికళకు కొందరు పార్టీ సీనియర్లు సూచించారు. ఈ షాక్ ఇలా ఉండగానే శశికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అన్నాడీఎంకే పార్టీకి చెందిన మైలాపూర్ శాసనసభ నియోజక ఎమ్మెల్యే నటరాజ్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ వారసురాలిగా తెరమీదకు వచ్చిన శశికళ ఆదిలోనే నియంతృత్వం ప్రదర్శిస్తున్నారని పేర్కొంటూ తన ఎమ్మెల్యేగిరీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి తమిళ రాజకీయాల్లో కలకలం సృష్టించారు.