శశికళకు ఊహించని భారీ షాక్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్న శశికళకు ఊహంచని భారీ షాక్ తగిలింది. శశికళ విధేయుడు, గట్టి మద్దతుదారుడైన మంత్రి పాండ్యరాజన్ ప్లేటు ఫిరాయించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గంలో చేరబోతున్నట్టు ఆయన చెప్పారు. ప్రజలందరి అభిప్రాయాన్ని కచ్చితంగా గౌరవించాలని, అమ్మ ఆశయాల కోసం అన్నా డీఎంకేని కాపాడేందుకు పోరాడుతానని పాండ్య రాజన్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో పన్నీరు సెల్వం కొనసాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
తమిళనాడు విద్యా శాఖ మంత్రిగా పాండ్యరాజన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిన్నటి వరకు శశికళకు నమ్మినబంటుగా ఉన్న ఆయన ముఖ్యమంత్రిపై విమర్శలు కూడా చేశారు. పార్టీని చీల్చేందుకు పన్నీరు సెల్వం ప్రతిపక్ష డీఎంకేతో చేతులు కలిపారని ఇటీవల ఆరోపించారు. ఇంతలోనే ఆయన మనసు మార్చుకోవడం గమనార్హం. కాగా పన్నీరు సెల్వంను ఆయన ఎప్పుడు కలిసేది, మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.