సచిన్ బ్లాస్టర్స్ కి షాకిచ్చిన గంగూలీ!
భారత్ క్రికెట్ లో సూపర్ స్టార్స్ అయిన సచిన్ టెండుల్కర్ సౌరబ్ గంగూలీ లు ఫుట్ బాల్ జట్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇండియన్ సూపర్ లీగ్ (ఐ.ఎస్.ఎల్) సూపర్ సక్సెస్ అయిన సంగతీ తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఈ ఐ.ఎస్.ఎల్. మూడో సీజన్ కు అదిరిపోయే ముగింపు లభించింది. ఆదివారం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అట్లెటికో డి కోల్ కతా రెండోసారి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ లో సొంతగడ్డపై తొలి టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరిన కేరళ బ్లాస్టర్స్ ఎఫ్.సీ.పై కోల్కతా 4–3 తేడాతో పెనాల్టీ షూటౌట్ ద్వారా గెలిచింది. కాగా 2014 తొలి సీజన్ ఫైనల్లోనూ కోల్కతా జట్టు కేరళపైనే నెగ్గి టైటిల్ సాధించింది.
ఈ సీజన్లో సొంతగడ్డపై వరుసగా ఆరు విజయాలు సాధించిన కేరళకు తొలి పరాజయం అందించడం ద్వారా చాంపియన్ గా నిలిచిన కోల్ కతాకు రూ.8 కోట్లు రన్నరప్ కేరళకు రూ.4 కోట్లు దక్కాయి. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో నిర్ణీత సమయానికి ఇరు జట్లు్ 1–1తో సమంగా నిలవగా ఫలితం కోసం అదనపు సమయాన్ని కేటాయించినా గోల్స్ నమోదు కాకపోవడంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని రాబట్టారు.
ఈ పెనాల్టీ షూటైట్ లో మొదట కేరళ నుంచి ఆంటోనియో జర్మన్ రఫీఖ్ బెల్ఫోర్ట్ లు గోల్స్ సాధించగా డోయో హెంగ్ బర్ట్ విఫలమయ్యారు. ఇక కోల్ కతా నుంచి డౌటీ లారా బోర్జా జ్యువెల్ రాజా విజయవంతం కాగా హ్యూమే ఒక్కడు విఫలమయ్యాడు. దీంతో కోల్ కతా విజయం సాధించినట్లయ్యింది.