తండ్రితో కేటీఆర్ ఏం మాట్లాడాలో చెప్తున్న కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా నిర్వాసితులకు పరిహారం ఇచ్చేందుకు జీవో 123 తీసుకురావడం అది వివాదాస్పదమై కోర్టులు కూడా మొట్టికాయ వేయడంతో…కొత్త జీవో 38ను విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది. తమ పోరాటాల వల్లే ఈ  మార్పు జరిగిందని చెప్పుకొంటోంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి – మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న భూ సేకరణ చట్టాన్ని కాదని జీవో 123 తేవడం ఆ తరువాత వెనక్కి తగ్గడాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావిస్తూ… ఈ రాష్ట్రం ఎవరి జాగీరు కాదనే విషయం టీఆర్ ఎస్ తెలుసుకోవాలని  వ్యాఖ్యానించారు.

రెండేళ్ల క్రితం ప్రభుత్వం జీవో 123 తెచ్చిందని ఇపుడు మరో జీవో ఇచ్చిందని పేర్కొంటూ ఇన్ని రోజులుగా ఈ సర్కారుకు సోయి లేకుండా వ్యవహరించిందా..? అని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న పోరాటం కారణంగానే.. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయడానికి ఈ సర్కారు తాజాగా జీవో 38 తెచ్చిందని తెలిపారు. 2013 ప్రకారం భూ సేకరణ చేయాలంటే.. టీఆర్ ఎస్ సర్కారు అడ్డగోలుగా వాదన చేసిందన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని సవరించేందుకు మోడీ సర్కార్ అనేక సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినా నిలబడలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రప్రభుత్వం జీవో 123 ద్వారానే ఎక్కువ పరిహారం వస్తుందని అబద్ధపు ప్రచారం చేసిందని విమర్శించారు. భూ సేకరణ అంశంలో రైతులకు ఈ సర్కారు అన్యాయం చేసిందన్నారు. చిన్నకారు రైతుల నుంచి భూములు లాక్కొని – పారిశ్రామికవేత్తలకు అప్పగించిందని ఆరోపించారు. సర్కారు చేస్తున్న అన్యాయాన్ని తాము ప్రశ్నించి 2013 భూ సేకరణ చట్టం అమలు చేసే విధంగా ఒత్తిడి తేగలిగామని చెప్పారు.

ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకుంటున్నదని తప్పుడు ప్రచారం చేశారని ఇపుడు  జీవో 38 జారీ చేయడం ద్వారా ఎవరు తప్పు చేశారో తేలిపోయిందని మంత్రి హరీశ్ రావుపై దామోదర రాజనర్సింహా విమర్శలు కురిపించారు. ‘ప్రతిపక్షాల వీపులు పగులుతాయని చెప్పడం కాదు కేటీఆర్…వీపులు పగులగొడతారని జీవో మార్చారా అని మీ తండ్రి కేసీఆర్ ను అడుగు’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల కోసం 30 వేల ఎకరాలు సేకరించినా ఇప్పటివరకూ ఒక్క గ్రామసభ కూడా ఈ ప్రభుత్వం నిర్వహించలేదని దామోదర అన్నారు.

ఇది తెలంగాణ ప్రభుత్వ దౌర్బాగ్యమన్నారు. 123 జీవోపై గొప్పలు చెప్పిన కెేసీఆర్ – అయన మంత్రులు .. అసలు ఈ జీవో ప్రకారం భూసేకరణ చేశారా . భూమి కొనుగోలు చేశారా చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలా కాదు.. రాజ్యంలా మారిందన్నారు. కాంగ్రెస్ ఒత్తిడి కారణంగా జీవో 38 తెచ్చినా.. పేదల భూమిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు రైతులకు 2013 భూ సేకరణ చట్టం ద్వారానే న్యాయం జరుగుతుందన్నారు. మామ-అల్లుళ్ల ఇలాకాలోనే ఉద్యమం మొదలైందని భవిష్యత్లో ముఖ్యమంత్రి కేసీఆర్- మంత్రి హరీశ్ రావుకు ప్రజలు బుద్ది చెబుతారని దామోదర హెచ్చరించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *