నిర్ణయం గవర్నర్ చేతిలో.. పన్నీర్ దూకుడు… చిన్నబోయిన శశికళ

తమిళ తకరారు రాజ్‌భవన్‌కు చేరింది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం మంకుపట్టి కూర్చొన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ భవిష్యత్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు చేతిలో ఉంది. మరోవైపు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం తన దూకుడును కొనసాగిస్తున్నారు. మరోవైపు గురువారం గవర్నర్‌ను కలిసి బయటకు వచ్చిన తర్వాత శశికళ ముఖం చిన్నబోయింది. దీంతో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠత నెలకొనివుంది.

మరోవైపు తమిళనాడు అసెంబ్లీలో బల నిరూపణకు అటు శశికళ.. ఇటు పన్నీర్‌ సెల్వం ఇద్దరూ సై అంటున్నారు. ఇంతకీ, నిజంగా ఎవరికి పూర్తి బలం ఉంది!? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని తిరుగుతున్న పన్నీర్‌ సెల్వం బల నిరూపణకు సిద్ధమని ప్రకటించడంపై ప్రతి ఒక్కరూ విస్మయానికి గురిచేస్తోంది. అయితే, పక్కా లెక్కలు లేకుండా ఆయన అంత విశ్వాసంతో ముందుకురారన్నది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు తనకు మొత్తం 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శశికళ చెబుతున్నా, వాస్తవానికి అంత లేరని, అసెంబ్లీలో బల నిరూపణ పెడితే ఎక్కువమంది తనకే మద్దతు పలికే అవకాశం ఉందని పన్నీరు ఘంటాపథంగా చెపుతున్నారు. దీంతో శశికళ వర్గానికి ముచ్చెమటలు పడుతున్నాయి. మంగళవారం రాత్రి పన్నీరు సెల్వం తిరుగుబాటు చేసిన తర్వాత శశికళ ఎమ్మెల్యేల సమావేశం పెట్టారని, దానికి 87 మంది మాత్రమే హాజరయ్యారని గుర్తు చేస్తున్నారు.

అలాగే, గురువారం పరిణామాలు కూడా పన్నీరుకు అనుకూలంగా మారాయని చెబుతున్నారు. సీనియర్‌ నేత మధుసూదన్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయాలని అమ్మ చెప్పిందంటూ పన్నీరు సెల్వం ప్రకటించారు. దీంతో ఆయన సెల్వం గూటికి చేరుకున్నారు. ఆయన వెంట శశికళ క్యాంపులో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే, పన్నీరు సెల్వానికి మద్దతుదారులైన 20 మందిని శశికళ హోటల్లో నిర్బంధించారని, వారి చుట్టూ పటిష్ట భద్రత పెట్టారన్నారు. అసెంబ్లీలో బల నిరూపణ జరిగితే వారంతా పన్నీరుకే ఓటు వేస్తారని కూడా ఆయన వర్గీయులు చెబుతున్నారు. దాంతో, శశికళ క్యాంపు నుంచి ఇప్పటికే 30 మందికిపైగా ఎమ్మెల్యేలు జారిపోయారని పన్నీరు వర్గీయులు వివరిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *