టీమిండియాకు ఉగ్ర ముప్పు?
వెస్టిండీస్లో పర్యటిస్తున్న టీమిండియా కు ఉగ్రముప్పు పొంచి ఉందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి మెయిల్ రావడం కలవరపాటుకు గురి చేసింది. ఆదివారం వచ్చిన ఈ మెయిల్పై బీసీసీఐ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యాడు. ఈ క్రమంలోనే ఆంటిగ్వాలోని భారత హైకమిషన్కు సమాచారమిచ్చామని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి చెప్పారు. ఈ నేపథ్యంలో హైకమిషన్.. స్థానిక ప్రభుత్వ యంత్రంగాన్ని అప్రమత్తం చేసిందని, భారత ఆటగాళ్లకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ తగిన జాగ్రత్తలు తీసుకుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారి చెప్పుకొచ్చారు. అక్కడి పరిస్థితులపై ప్రత్యేక నిఘా ఉందని, అవసరమైతే మరింత భద్రత పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా టీమిండియా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్లు గెలవగా, ఈనెల 22 నుంచి టెస్టు సిరీస్ ఆడనుంది.