సెంచరీ చేయలేదని బాధ లేదు: టీమిండియా వైస్ కెప్టెన్ రహానె
టీ20, వన్డేల్లో మెరుపులు మెరిపించిన టీమిండియా ఆటగాళ్లకు తొలి టెస్టులో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్పై ఆధిపత్యం సాధించారు. అయితే ఇలాంటి పరిస్తితుల్లో టీమిండియా వైస్ కెప్టెన్ రహానె అదరగొట్టాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ 81 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలిరోజు మ్యాచ్ పూర్తయిన వెంటనే మీడియాతో మాట్లాడాడు. మీరు సెంచరీ సాధించి రెండేళ్లయింది అని ఆయన్ని మీడియా ప్రశ్నించగా దానికి అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. మీరు ఈ ప్రశ్న వేస్తారని ముందే ఊహించాను. సెంచరీ చేయలేదని బాధ లేదు. నేను జట్టుకోసం ఆడుతున్నాను. వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండటమే ముఖ్యం. కాబట్టి సెంచరీ గురించి ఆలోచించడం లేదు. గత కొంతకాలంగా జట్టులో నా ప్రదర్శన చూస్తే అది మీకే తెలుస్తుంది. జట్టు 25/3 సమయంలో శతకం గురించి ఆలోచించడం కంటే జట్టు గురించి ఆలోచిస్తే బాగుంటుంది’అని అన్నాడు. అయితే ఈ మ్యాచులో రహానె(81; 163బంతుల్లో 10×4) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్(44; 97బంతుల్లో 5×4) రాణించడంతో భారత్ మొదటి రోజు 68.5 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.