ఏపీకి తెలంగాణ సీఎం కేసీఆర్…
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన జనవరి 30న తిరుమల, విజయవాడలలో పర్యటించనున్నారని సమాచారం.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి, విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మ వారికి కేసీఆర్ మొక్కులను చెల్లించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తే.. పలు దేవాలయాలను సందర్శిస్తానని, మొక్కులు చెల్లించుకుంటానని కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగా ఇప్పటికే వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటాన్ని సమర్పించారు. ఇక తిరుమల దేవస్థానం, విజయవాడ కనకదుర్గా అమ్మవారి ఆలయాలను సందర్శించాల్సి ఉంది కేసీఆర్.
ఈ నేపథ్యంలోనే ఆయన జనవరి 30న దేవాలయాల సందర్శనకు ఏపీకి బయల్దేరనున్నట్లు తెలిసింది.
కాగా, ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరైన సమయంలోనే.. సీఎం కేసీఆర్, విజయవాడ అమ్మ వారి ఆలయాన్ని సందర్శిస్తారని అనుకున్నా అప్పుడు వాయిదా పడింది.