తెలంగాణలో డీఎస్సీకి లైన్ క్లియర్..8452 పోస్టులకు గ్రీన్ సిగ్నల్
నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ రెండు మూడు రోజుల్లో తీపి కబురు అందించబోతోంది. 8452 టీచర్ పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అడ్వకేట్ జనరల్ సలహా తీసుకొని 31 జిల్లాలతో నోటిఫికేషన్ ఇవ్వలా ? లేదంటే పాత జిల్లాలతోనే నోటిఫికేషన్ ఇవ్వలా దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది. టీపీఎస్సీ విడుదల చేస్తున్న నోటిఫికేషన్లు ఏవో కారణాలతో కోర్టు కేసులతో నిలిచిపోతున్నాయ్. దీంతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కడియం పలుసార్లు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్ ఇవ్వాలని భావించారు. అయితే జోనల్ వ్యవస్థ రద్దు కాకుండా విడుదల చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయన్న కారణంతో విరమించుకున్నారు.
విద్యాశాఖ అధికారులు సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత 8452 పోస్టులు భర్తీ చేయాలని ఆర్థిక శాఖకు ఫైల్ పంపింది. దీనికి ఆర్థికశాఖ ఆమోదం ముద్ర వేయడంతో టీఎస్పీఎస్సీ రెండు మూడు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఖాళీల వివరాలను వారంలోపు పంపాలని అన్ని శాఖలకు నోట్ పంపింది ఆర్థిక శాఖ. ఇప్పటికే అన్ని శాఖల్లో 49500 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఉద్యోగుల రిటైర్మెంట్తో అన్ని శాఖల్లో 20వేల ఖాళీలు ఉండవచ్చని అంచనా వేస్తోంది సర్కార్.