తెలంగాణలో పెరిగిన వడగాల్పుల తీవ్రత
తెలంగాణలో వడగాల్పుల తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 2 నుంచి 4 డిగ్రీలు అదనంగా పెరిగి అన్ని చోట్లా 42 డిగ్రీలను దాటే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం పలుప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశముందని కేంద్రం సంచాలకురాలు డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. ఆదివారం పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో గాలిలో తేమ పూర్తిగా తగ్గి వేడి, ఉక్కపోతలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
గత పదేళ్లలో ఏప్రిల్ నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల స్థాయికి చేరువగా ఆదివారం నమోదవడం గమనార్హం. హైదరాబాద్లో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణంకన్నా 4 డిగ్రీలు అదనం. ఇలాంటి పరిస్థితుల్లో వడగాలుల తీవ్రత ఎక్కువవుతుంది.
ఆదివారం అత్యధికంగా ఆదిలాబాద్, నిజామాబాద్లలో ఉష్ణోగత్ర 44.4 డిగ్రీలకు చేరింది. హైదరాబాద్లో గాలిలో తేమ సాధారణంగా 52 శాతముండాలి. కానీ అది 31 శాతానికి పడిపోవడంతో నగరవాసులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.