తెలంగాణ నుంచి అమెరికా క్రికెట్ టీంకు సెలెక్ట్ అయిన సింధుజారెడ్డి..!
అమెరికా మహిళల జాతీయ క్రికెట్ టీంలో తెలంగాణకు చెందిన మహిళ సింధుజారెడ్డి సెలక్ట్ అయ్యారు. ఆగస్టులో స్కాట్లండ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలోనూ అమెరికా సత్తా చూపితే తాను 2020లో జరిగే టీ20 ప్రపంచకప్లోనూ ఆడగలనన్న ఆశాభావం సింధుజారెడ్డి వ్యక్తంజేసింది.
నల్గొండ జిల్లా ఆమన్గల్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల సింధుజారెడ్డి హైదరాబాద్లో ప్రాథమిక విద్యతోపాటు, బీటెక్ చదివింది. 12 ఏళ్ల వయస్సులోనే క్రికెట్ ఆడడం ప్రారంభించిన ఆమె 14 ఏళ్లపాటు హైదరాబాద్ అండర్-16, అండర్-19 జట్లకు కీపర్, ఓపెనింగ్ బ్యాట్స్ఉమన్గా ప్రాతినిధ్యం వహించింది. తొలుత విజయ్కుమార్ వద్ద ఆపై భారత జట్టు మాజీ కెప్టెన్ పూర్ణిమారావు వద్ద శిక్షణ పొందింది. వివాహం అనంతరం అమెరికా వెళ్లిపోయిన ఆమె కొద్దికాలం తర్వాత మళ్లీ క్రికెట్ బ్యాట్ చేతపట్టింది. లోకల్ క్లబ్ మ్యాచ్ల్లో సత్తా చూపి జాతీయ జట్టు సెలెక్షన్ ట్రయల్స్కు ఎంపికైంది.