ఇండియాలో ప్రవేశించిన ఉగ్రవాదులు: హైఅలర్ట్
గుజరాత్ తీరం ద్వారా అఫ్ఘానిస్తాన్ పాస్ పోర్ట్ లతో నలుగురు ఉగ్రవాదులు భారత దేశంలోకి ప్రవేశించారని ఇంటిలిజెన్స్ బ్యూరో సమాచారం ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం అన్నీ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా గుజరాత్ వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ నెల మొదటి వారంలోనే వారు దేశంలోకి ప్రవేశించినట్టు కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. ఏ సమయంలో అయిన వారు దాడులకు పాల్పడవచ్చని దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులుగా భావిస్తున్న నలుగురు ఊహ చిత్రాలను ఐబీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్తో పాటు ఉత్తర భారతంలోని మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. భారీ ఉగ్రకుట్రకు వారు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. హోటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు సహా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని కోరాయి. కీలకమైన ప్రాంతాల్లో నిఘా పెంచాలని, అనుమానితులను ప్రశ్నించాలని, వాహనాలను తనిఖీ చేయాలని కేంద్రం సూచించింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు.