ఆరోగ్యశాఖమంత్రి స్వయంగా రక్తదానం చేసి…
రాంచీ: జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి బన్నా గుప్తా రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(రిమ్స్)లో ఆయన తనిఖీ చేస్తున్న సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఆసుపత్రిలో చేరిన ఒక వృద్ధ మహిళ గత ఏడు రోజులుగా చికిత్స పొందుతోంది. అయితే బ్లడ్ బ్యాంకులో ఆమెకు అవసరమైన రక్తం అందుబాటులో లేకపోవడంతో ఆమెకు చికిత్స అందించేందుకు ఇబ్బంది ఏర్పడింది. ఆమె భర్త ఈ విషయాన్ని మంత్రికి తెలియజేశాడు. వెంటనే స్పందించిన మంత్రి రక్త దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో వైద్య సిబ్బంది మంత్రి నుంచి రక్తం సేకరించి ఆ వృద్ధురాలికి చికిత్స అందించారు. ఈ సందర్భంగా రిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి స్వయంగా రక్తదానం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.