దిశ ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం ప్రత్యేక విచారణ

దిశ కేసు నిందితుల ఎ‌న్‌కౌంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ సోమవారం (ఫిబ్రవరి 3) హైదరాబాద్ చేరుకుంది. హైకోర్టు ప్రాంగణం నుంచి ఈ కమిషన్ కార్యకలాపాలు కొనసాగించనుంది. ఇప్పటికే కేసు విచారణ ప్రారంభించిన ఈ కమిషన్ డైరీలు, ఇతర ఆధారాలను తెప్పించుకొని పరిశీలించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో జ్యుడీషియల్ కమిటీ దర్యాప్తును ముమ్మరం చేసింది. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో పొల్గొన్న పోలీసు సిబ్బందిని, ఇతర అధికారులను కమిషన్ సభ్యులు విచారించనున్నారు. బాధితుల కుటుంబ సభ్యులను విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. హైకోర్టు సి-బ్లాక్ నుంచి ఈ కమిషన్ తన కార్యకలాపాలు సాగించనుంది. సుప్రీంకోర్టు కమిషన్ పర్యటన నేపథ్యంలో హైకోర్టు వద్ద ప్రభుత్వం సీఆర్‌పీఎఫ్ బలగాలతో పటిష్ట భద్రతఏర్పాటుచేసింది.ఎన్‌కౌంటర్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నుంచి జ్యుడీషియల్ కమిషన్ వివరాలు సేకరించనుంది. సుప్రీంకోర్టు నియమించిన కమిషన్ సభ్యులకు ఎన్‌కౌంటర్ కేసు వివరాలను అందించడానికి సిట్ బృందం హైకోర్టులోని సి-బ్లాక్‌కు చేరుకుంది. నిందితుల పోస్టుమార్టం, రీ-పోస్టుమార్టం రిపోర్టులను కూడా జ్యుడీషియల్ కమిటీ పరిశీలించనుంది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఆరా తీయనుంది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో నలుగురు నిందితులు గతేడాది డిసెంబర్ 6న షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమైన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక విచారణ కమిషన్‌‌ను నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పుర్కర్‌ నేతృత్వంలో త్రిసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌ సభ్యులుగాఉన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *