ఈసారి నూతన సంవత్సర వేడుకలు
న్యూ ఇయర్ వేడుకలు సంతోషంగా జరుపుకోండి.. అంటూ పోలీస్శాఖ చేసిన ప్రచారం సత్ఫలితాలనిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి నూతన సంవత్సర వేడుకలు అపశ్రుతులు లేకుండా పూర్తికావడంపై అంతా సంతోషం వ్యక్తంచేస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి వేడుకల తర్వాత మద్యం మత్తులో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల బారినపడే ఘటనలు వీలైనంతవరకు తగ్గించేందుకు పోలీసులు తీసుకున్న బందోబస్తు చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. హద్దు మీరే మందుబాబుల కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధితోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించారు. హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నూతన సంవత్సర వేడుకల్లో మద్యం మరింత జోష్ నింపింది. రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో సుమారు రూ.300 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. సాధారణ రోజులతో పోలిస్తే ఈ రెండురోజుల్లో మ ద్యం విక్రయాలు భారీగా పెరిగినట్టు అధికారులు చెప్పారు. సాధారణంగా సగటున రోజుకు రూ.60 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతాయి. డిసెంబర్ 30న రూ.130 కోట్లు, డిసెంబర్ 31 ఒక్కరోజే రూ.170 కోట్ల మేర విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్శాఖ అధికారి ఒకరు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయంవరకు రాష్ట్రవ్యాప్తంగా ఏ విధమైన ప్రమాద ఘటనలు జరుగలేదు. స్వీయ నియంత్రణతో ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీస్శాఖకు సహకరించి 2020 సంవత్సరానికి సానుకూల స్వాగతం పలికిన తీరు అభినందనీయం. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ పోలీసుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. న్యూ ఇయర్ వేడుకలను ప్రమాద రహితంగా నిర్వహించడంలో సమర్థంగా విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు, సిబ్బందికి అభినందనలు.
– మహేందర్రెడ్డి, డీజీపీ