టికెట్ కోసం రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని
హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీలో మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేత రాపోలు రాములకు మధ్య జరిగిన ఆడియో టేపు ఫోన్ సంభాషణ తాజాగా బయటకు పొక్కడంతో ఈ టేప్ సంచలనం రేపుతోంది. తన మనిషి రమేష్కు టికెట్ ఎందుకు ఇవ్వలేదని రాపోలు రాములు మల్లారెడ్డిని నిలదీశారు. . ‘‘నీపై నమ్మకం పోయింది. నా వారిలో ఎవరికి టికెట్ ఇప్పించావు చెప్పు..’’ అని రాపోలు నిలదీయగా, తొందర పడొద్దని మంత్రి మల్లారెడ్డి నచ్చజెప్పారు. అయినా, రాపోలు వినలేదు. మల్లారెడ్డి వ్యవహారమంతా పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెప్తానని, త్వరలో ఆయన్ను కలుస్తానని ఫోన్లో రాపోలు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కూడా నీ గురించి చెప్తానని బెదిరించగా, చెప్పుకోమని మల్లారెడ్డి సమాధానమిచ్చారు. టికెట్ కోసం తన వద్ద మంత్రి మల్లారెడ్డి రూ. 50 లక్షలు డబ్బు డిమాండ్ చేసిన తాలూకు రికార్డులు ఉన్నాయని, వాటిని అధిష్ఠానానికి చెప్తానని బెదిరించారు. తనపై పోలీసు నిఘా పెట్టినా ప్రజల కోసం తాను జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధమేనని వెల్లడించారు. తన మనిషి రమేష్కు టికెట్ ఎందుకు ఇవ్వలేదని రాపోలు రాములు మల్లారెడ్డిని నిలదీశారు. ఆయన ఒక్కసారి కూడా తన వద్దకు రాలేదని మల్లారెడ్డి జవాబిచ్చారు. ప్రజల మధ్య ఉండాలా, నీ చుట్టూ తిరగాలా అని రాములు ప్రశ్నించారు. మల్లారెడ్డికి సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని, పోలీసులకు పట్టిస్తానని రాపోలు రాములు హెచ్చరించారు. నేతల మధ్య విభేదాలు బయటపడి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.