మరణ శిక్ష అమలుకు ట్రంప్ ఆమోదం
20 సంవత్సరాల తరువాత అమెరికా మళ్లీ మరణశిక్షలను అమలు చేయనుంది. ఈ దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అత్యంత కిరాతకమైన నేరాలకు పాల్పడిన వారికి మరణదండన అమలు చేయాల్సిందేనన్న ఫైల్ పై ఆయన సంతకం చేశారు. హీనమైన నేరాలకు పాల్పడిన ఐదుగురికి ఇప్పటికే మరణశిక్షను విధించి, ఎప్పుడు అమలుచేయాలనే తేదీలను కూడా ఖరారు చేసింది. దీనిపై అమెరికా అటార్నీ జనరల్ విలియం బార్ ఓ ప్రకటన చేశారు.
ఘోరమైన నేరాలకు పాల్పడిన వారికి మరణ శిక్ష అమలు చేయాలని న్యాయ శాఖ ఎప్పటి నుంచో కోరుతోందని గుర్తు చేశారు. బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత న్యాయశాఖపై ఉందని, పెండింగ్ లోని మరణ శిక్షలను అమలు చేయాలంటూ జైళ్ల శాఖను ఇప్పటికే ఆదేశించామని ఆయన అన్నారు. అమెరికాలో మరణశిక్ష అంటే మన దగ్గరలా ఉరిశిక్ష విధించకుండా, విషపూరిత మందులు ఇచ్చి నేరస్తులు చనిపోయేలా చేస్తారు.