ఆర్టీసీకి అపారమైన నష్టం
- రోజుకు రూ.2.5 కోట్ల ఆదాయం లభిస్తే నిర్వహణ వ్యయం, ఇతర ఖర్చులన్నీ కలిపి రూ.3.5 కోట్ల వరకు ఉండేవి. ప్రస్తుతం సమ్మె రోజుల్లో అది రెట్టింపైంది. సిబ్బంది జీతభత్యాలు, విడిభాగాల కొనుగోళ్లు, తదితర నిర్వహణ వ్యయం తగ్గినప్పటికి సిటీలో తిరిగే బస్సుల సంఖ్య, ట్రిప్పులు, కిలోమీటర్లు సగానికి పైగా పడిపోవడంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. సమ్మె ప్రారంభించిన తొలి 10 రోజుల్లో రోజుకు రూ.20 లక్షలు కూడా ఆర్జించలేకపోయారు. రోజుకు 500 నుంచి 700 వరకు బస్సులు నడిచేవి. ఇప్పుడు బస్సుల సంఖ్య 1300 నుంచి 1500 వరకు చేరుకుంది. ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లు అందుబాటులోకి రావడంతో బస్సుల సంఖ్యను కొంత మేరకు పెంచారు.సిటీ బస్సులు నడపడంలో పెద్దగా అనుభవం లేని ప్రైవేట్ డ్రైవర్ల వల్ల డీజిల్ వినియోగం పెరిగింది. గతంలో ఒక లీటర్పైన 4.5 కిలోమీటర్ల చొప్పున నడిచిన ఆర్డినరీ బస్సులు ఇప్పుడు 3 కిలోమీటర్లకు తగ్గినట్లు అంచనా. సమ్మెకు ముందుకు నగరంలోని 3750 బస్సులు ప్రతి రోజు 9.5 లక్షల కిలోమీటర్లు తిరిగితే ఇప్పుడు 4 లక్షల కిలోమీటర్లు కూడా తిరగడం లేదు.
డిపోల్లో మెకానిక్అవసరమైన విడిభాగాలను ఏర్పాటు చేసి బస్సులు బ్రేక్డౌన్లకు గురికాకుండా చర్యలు తీసుకొనే సమర్ధవంతమైన యంత్రాంగం ఆర్టీసీకి ఉంది. ఇప్పుడు ఆ సిబ్బంది అంతా సమ్మెలో ఉండడం వల్ల బస్సుల నిర్వహణ కొరవడింది. మెకానిక్లు లేకపోవడంతో బ్రేక్డౌన్స్ పెరిగాయి. చెడిపోయిన బస్సులు డిపోలకే పరిమితమవుతున్నాయి. సమ్మె ఇలాగే కొనసాగితే ఆర్టీసీకి మరింత అపారమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.