గవర్నర్ తర్వాత అంత గౌరవం రామోజీకే
రాష్ట్ర గవర్నర్…ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తర్వాత అంతటి గౌరవాన్ని మీడియా మొఘల్ రామోజీ రావు పొందారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న రాష్ట్ర ప్రథమపౌరుడు అంతటి గౌరవాన్ని రామోజీరావు ఎలా పొందారు అనే కదా మీ సందేహం.
దీనికి వచ్చే ఆసక్తికరమైన సమాధానం రామోజీ ఇంట జరిగిన పెళ్లి సందడి. రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు పెద్ద మనవరాలు సహరి వివాహ వేడుక శుక్రవారం రాత్రి రామోజీ ఫిల్మ్సిటీలో అంగరంగ వైభవంగా జరిగింది.ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ల పెద్ద కుమార్తె సహరి వధువు. వరుడు రేచస్ వీరేంద్రదేవ్ భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా, సుచిత్రల కుమారుడు.
సహజంగా ఇద్దరు చంద్రులు గవర్నర్ సమక్షంలో జరిగిన చర్చలు లేదా ఇతరత్రా వేడుకల్లో మాత్రమే కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు ఇలా తప్పకుండా కలవాల్సిన సమయాలను సైతం పలు సందర్భాల్లో ఎవరో ఒకరు పక్కనపెట్టేశారు. ఇక కలిసిన సమయంలో గవర్నర్తో కలిసి ఉమ్మడిగా ఫోటో దిగిన ఉదంతాలు ఉన్నాయి. దాదాపుగా మరెప్పుడూ అలా ఇద్దరు చంద్రులు ఒకరి పక్కన మరొకరు ఉన్న ఘటనలు లేవు.
కానీ రామోజీ రావు ఆ ప్రత్యేకతను సంతరించుకున్నారు. సహరి-రేచస్ వీరేంద్రదేవ్ల వివాహ వేడుకలో రామోజీ పక్కన ఇద్దరు చంద్రులు నిలుచొని చిరునవ్వులు చిందించారు. తద్వారా గవర్నర్కు మాత్రమే దక్కినటువంటి గౌరవాన్ని రామోజీ రావుకు అందించారు. కాగా, ఈ కల్యాణ వేడుకకు న్యాయ, రాజకీయ, అధికార, పారిశ్రామిక, మీడియా, చలనచిత్ర రంగాల ప్రముఖులు విచ్చేశారు.