కీలక భాగస్వామ్యానికి ‘ఫుల్’స్టాప్!
విశాఖ:భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ నమోదు చేసిన కీలక భాగస్వామ్యానికి ఉమేశ్ యాదవ్ చెక్ పెట్టాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ లు 110 పరుగుల భాగస్వామ్యాన్ని చేసి ఈ రోజు ఆటలో మంచి ఆరంభినిచ్చారు. అయితే ఆ జోడి మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో బెయిర్ స్టో(53;152 బంతుల్లో 5 ఫోర్లు)ను ఉమేశ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఉమేశ్ వేసిన 79 ఓవర్ మూడో బంతి బెయిర్ స్టో ఊహించేలోపే బెయిల్స్ ను పడగొట్టింది. ఆ ఫుల్ లెంగ్త్ డెలివరీని అంచనా వేయడంలో స్టో విఫలమై వికెట్ ను సమర్పించుకున్నాడు. ఆ బంతి బెయిర్ స్టో షూను తాకుతూ బెయిల్స్ పైకి వెళ్లిపోవడం,ఆ పై మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్ లేచిపోవడం చకచకా జరిగిపోయాయి. దాంతో 190 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ ను నష్టపోయింది. శనివారం ఆటలో లంచ్ కు రెండు ఓవర్లలోపు స్టో అవుట్ కావడంతో ఇంగ్లండ్ శిబిరంలో నిరాశ చోటు చేసుకుంది. లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి 191పరుగులు చేసింది.