కేంద్రమంత్రి అనిల్ మాధవ్ దవే కన్నుమూత
కేంద్ర పర్యావరణ, అటవీశాఖమంత్రి అనిల్ మాధవ్ దవే (61) గురువారం ఉదయం ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన హఠాన్మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దవే మృతి వ్యక్తిగతంగా తనకు తీవ్ర నష్టమని, నిన్న సాయంత్రం వరకూ ఆయన తనతో కీలక విధానాలు చర్చించినట్లు నరేంద్ర మోదీ తెలిపారు.
1956లో జూలై 6న మధ్యప్రదేశ్లోని బాద్నగర్లో దవే జన్మించారు. గుజరాతీ కళాశాల నుంచి ఎం.కామ్ పట్టాను పొందారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్లో చేరిన దవే.. నర్మదా నది సంరక్షణ కోసం పోరాడారు. అనిల్ మాధవ్ దవే మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గతేడాది జరిగిన మంత్రివర్గ విస్తరణలో ప్రధానమంత్రి మోదీ.. దవేకు పర్యావరణ, అటవీ శాఖ బాధ్యతలను అప్పజెప్పారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా దవే మృతి పట్ల సంతాపం తెలిపారు.