అండ లేదని ఒప్పుకున్న పాక్
అధికరణ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజనను పాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. కశ్మీర్పై ఏకపక్ష నిర్ణయం సరికాదంటూ లేనిపోని వాదనలకు దిగుతూ అనేక ప్రయత్నాలకు పూనుకుంది. కానీ, అంతర్జాతీయ సమాజం నుంచి స్పందన కొరవడడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడింది. దీనితో కశ్మీర్పై భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల అంతర్జాతీయ సమాజం తమకు అండగా నిలిచే అవకాశం లేదని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ పరోక్షంగా అంగీకరించారు. అక్కడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన పాక్ ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. కశ్మీర్ అంశంలో భారత్పై పాక్ చేయబోయే ఫిర్యాదు స్వీకరించడానికి ఐరాస భద్రతా మండలి సిద్ధంగా లేదని ఘాటుగా స్పష్టం చేశారు. కశ్మీర్ అంశాన్ని ఉపయోగించుకొని భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం, అభ్యంతరాలు వ్యక్తం చేయడం చాలా సులభం. ఈ విషయంలో ముందుకు సాగడం చాలా కష్టం, ఐరాస మనల్ని పూలమాలతో స్వాగతం పలకడానికి సిద్ధంగా లేరు. శాశ్వత సభ్య దేశాల్లో ఎవరైనా మనకు అడ్డంపడవచ్చు. ప్రజలు వివేకంతో ఆలోచించాలి అని చెప్పారు. కశ్మీర్పై భారత్ తీసుకున్న నిర్ణయానికి రష్యా మద్దతుగా నిలిచిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.