దిల్ రాజు సినిమా విడుదల ఆపేశారు

తనకు నచ్చిన చిన్న సినిమాల్ని టేకప్ చేసి తన బేనర్ మీద రిలీజ్ చేయడం దిల్ రాజుకు అలవాటు. ఈ కోవలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు కొన్ని మంచి విజయం సాధించాయి. ఆయనకు గత ఏడాది ఓ చిన్న సినిమా నచ్చింది. మహ్మద్ యాకూబ్ అలీ అనే కొత్త దర్శకుడు ఆ చిత్రాన్ని నిర్మించాడు. నటీనటులు.. టెక్నీషియన్లు అందరూ కొత్తవాళ్లే ఇందులో. ఈ చిత్రానికి ఇంకేదో టైటిల్ ఉంటే.. రాజు ‘వెళ్లిపోమాకే’ అనే క్యాచీ టైటిల్ పెట్టాడు. చాన్నాళ్ల కిందటే ఈ చిత్రం విడుదలకు సిద్ధమైనప్పటికీ తన సొంతం సినిమాల హడావుడిలో ఉండటంతో రాజు.. దాని విడుదలను వాయిదా వేశారు. ఎట్టకేలకు మార్చి 10న రిలీజ్ అనుకుంటే.. కుదర్లేదు. 17కు వాయిదా వేశారు.

కానీ ఇప్పుడు 17కు కూడా ఈ సినిమా రావట్లేదు. నాలుగు రోజుల కిందటి వరకు సినిమా విడుదల పక్కా అనే అనుకున్నారు కానీ.. ఈలోపు దిల్ రాజు సతీమణి అనిత హఠాత్తుగా చనిపోవడంతో సినిమాను మరోసారి వాయిదా వేయక తప్పలేదు. ఈ సినిమా కేవలం దిల్ రాజు బ్రాండ్ మీదే రిలీజవుతోంది. మరి రిలీజ్ టైంలో ఆయన లేకుండా అంటే కష్టమవుతుంది. పైగా దిల్ రాజు సంస్థకు చెందిన వాళ్లందరూ ఇప్పుడు విషాదంలో ఉన్నారు. వాళ్లెవ్వరూ కూడా ఎప్పట్లా ఉత్సాహంగా రిలీజ్ పనులు చూసే పరిస్థితుల్లో లేరు. అందుకే ఈ సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఐతే వచ్చే వారం నుంచి వరుసగా పెద్ద సినిమాల తాకిడి ఉంది. ముందు ‘కాటమరాయుడు’ వస్తుంది. ఆపై రాధ.. రోగ్.. గురు.. చెలియా.. మిస్టర్ లాంటి సినిమాలు వరుస కట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘వెళ్లిపోమాకే’కు ఎప్పుడు మోక్షం కలుగుతుందో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *