రాహుల్ పై వెంకయ్య సెటైర్ అదిరింది..
పెద్ద నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనకు పార్లమెంటులో మాట్లాడే అవకాశం రాలేదంటూ గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. తాను కనుక మాట్లాడితే పార్లమెంటులో భూకంపం వస్తుందంటూ ఆయన ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ కీలక నేత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్ట్రాంగ్ కౌంటరేశారు. రాహుల్ చెబుతున్న భూకంపమేదో పార్లమెంట్ లో ఎవరూ లేని సమయంలో వస్తే మంచిది.. లేదంటే చాలా ప్రమాదం అని ఆయన అన్నారు.
అనివీతిని అంతం చేయాలని నల్ల ధనవంతులను శిక్షించాలని అను కోవడం తప్పా అంటూ ప్రతిపక్షంపై వెంకయ్యనాయుడు మండిపడ్డారు. కాగా పెద్దనోట్ల రద్దు అంశంపై పార్లమెంట్ లో తనను మాట్లాడనీయడం లేదని తాను మాట్లాడితే భూకంపం వస్తుందని.. పెద్దనోట్ల రద్దు పెద్ద కుంభకోణమని దానిని తాను నిరూపించగలనని రాహుల్ అంటున్నారు. నోట్ల రద్దుపై చర్చించకుండా ప్రధాని పారిపోతున్నారంటూ రాహుల్ విమర్శించారు.
రాహుల్ పదేపదే మోడీ టార్గెట్ గా విమర్శలు చేస్తుండడంతో వెంకయ్య తనదైన శైలిలో చమత్కరించారు. భూకంపం వస్తే రానీ కానీ పార్లమెంటులో ఆ సమయంలో ఎవరూ లేకపోతే ఎవరికీ ప్రమాదం ఉండదని అన్నారు.