విద్యాసాగర్ రావు అలా చేస్తే తప్పు చేసినట్లేనా?

అచితూచి అడుగులు వేస్తున్న తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు పెద్ద పరీక్షే ఎదురైంది.తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ఎదురవుతున్న ఇష్యూలు ఇప్పుడాయన్ను ధర్మసంకటంలో పడేస్తున్నాయి. అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎవరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలన్న అంశంపై తర్జనభర్జనలుపడుతూ.. పలువురి నిపుణుల సలహాలు.. సూచనలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

తాజా పరిస్థితుల్లో.. గవర్నర్ ఏం చేస్తే బాగుంటుందన్న అంశంపై అటార్నీ జనరల్ ఇచ్చిన సలహాతో..ముఖ్యమంత్రి ఎంపిక కార్యక్రమానికి ఎదురైన అడ్డంకులు తొలిగినట్లేనని అనుకున్నారు. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చేసిన సూచన ఏమిటంటే. అసెంబ్లీ సమావేశాన్నిఏర్పాటు చేసి..ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఇద్దరు పేర్లతో తీర్మానం ప్రవేశ పెట్టి.. ఎవరి అధిక్యత ఉందో తెలుసుకోవాల్సి ఉందన్నారు. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఉన్నందున.. ఆయన చేత ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టొచ్చని చెప్పారు. దీనిపై ఒక ప్రముఖ ఇంగ్లిష్ ఛానల్ రాజ్యాంగ నిపుణులతో ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అటార్నీ జనరల్ సూచనను రాజ్యాంగ నిపుణులు తిరస్కరిస్తున్నారు. అలా చేయటం తప్పని తేల్చి చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పన్నీర్ సెల్వం అపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమేనని.. అలాంటప్పుడు బలపరీక్ష చేయలేమని.. తొలుత ముఖ్యమంత్రిని ఎంపిక చేయాల్సిందేనని స్పష్టంగా తేల్చి చెబుతున్నారు లోక్ సభకు స్పీకర్ గా వ్యవహరించిన సోమ్ నాథ్ చటర్జీ. తొలుత ప్రమాణస్వీకారం చేయించిన తర్వాతనే బలపరీక్షకు ఆదేశించాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. అధిక్యం ఉన్న వారి చేత ప్రమాణస్వీకారం చేయించిన తర్వాతే బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించాలని ఆయన స్పష్టం చేస్తున్నారు.

సోమనాథ్ చటర్జీ వినిపించిన వాదన తరహాలోనే లోక్ సభ మాజీ సెక్రటరీ.. రాజ్యాంగ నిపుణుడు అయిన తంకప్పన్ ఆచారి కూడా తన అభిప్రాయాన్ని చెబుతున్నారు. పళనిస్వామికి ఎమ్మెల్యేలు స్వచ్చందంగా మద్దతు ఇస్తున్నారో లేదో తెలుసుకోవాలని.. అందరు ఎమ్మెల్యేలను రాజ్ భవన్ కు పిలిపించి.. వారిని వ్యక్తిగతంగా అభిప్రాయం తెలుసుకొని.. మెజార్టీ సభ్యుల అభిప్రాయం ప్రకారం ముఖ్యమంత్రిగా ఒకరిని నియమించాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మెజార్టీ ఉన్న నేతకు గవర్నర్ చెప్పాలి. అంతేకానీ.. బెదిరింపులతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని.. వెనక్కి తీసుకుంటానని చెప్పే పన్నీర్ మాటను పరిగణలోకి తీసుకోకూడదని స్పష్టం చేస్తున్నారు.

జేఎన్యూలోని సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్ కు చెందిన ప్రొఫెసర్ సుధా సాయి సైతం.. ఎమ్మెల్యేల అందరితో గవర్నర్ మాట్లాడి.. మెజార్టీ సభ్యుల అభిప్రాయానికి విలువను ఇచ్చి.. ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలే తప్పించి.. అసెంబ్లీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిని ఎన్నుకోవటం సరికాదని అభిప్రాయపడుతున్నారు. నిపుణులు చెబుతున్నట్లు రాజ్యాంగం చెబుతున్న విధానాన్ని గవర్నర్ ఫాలో అవుతారా? లేక.. సినిమాటిక్ సీన్ ను గవర్నర్ ఆవిష్కరిస్తారా? అన్నది ఇప్పుడుపెద్ద ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *