బాలివుడ్ దర్శక నిర్మాతకు నో చెప్పిన విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమాతోనే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో బాలీవుడ్ సినీ జనాలను కూడా ఆకట్టుకున్న విజయ్, ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాతో మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. విషయానికి వస్తే డియర్ కామ్రేడ్ సినిమా చూసిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. అయితే కరణ్ బాలీవుడ్లోనూ విజయ్ని హీరోగా నటించమని కోరినా, విజయ్ మాత్రం ఆ ఆఫర్ను తిరస్కరించాడు. గతంలో అర్జున్ రెడ్డి రీమేక్ విషయంలోనూ నో చెప్పిన విజయ్ తాజాగా డియర్ కామ్రేడ్ రీమేక్ విషయంలో కూడా అదే విధంగా స్పందించాడు. తనకు ఒకే కథలో రెండుసార్లు నటించడం నచ్చదని, అందుకే రీమేక్ లలో నటించనని, భాలివుడ్ చాన్స్ వస్తే చేస్తానని దేవరకొండ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
బాహుబలి తరువాత దక్షిణాది భాషలన్నింటిలో రిలీజ్ అవుతున్న తొలి చిత్రంగా డియర్ కామ్రేడ్ రికార్డ్ సృష్టించనుంది. విజయ్ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకే రోజు రిలీజ్ అవుతోంది.