కేటీఆర్ను కలిసిన వీవీఎస్
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఇవాళ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలుసుకున్నారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన మాజీ క్రికెటర్ లక్ష్మణ్తో కేటీఆర్ ముచ్చటించారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ, లక్ష్మణ్ తో మాట్లాడుతున్న చిత్రాలను పోస్ట్ చేశారు. హైదరాబాద్ లో క్రీడాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి తాము చర్చించామని తెలిపారు. మౌలిక వసతుల కల్పనపై లక్ష్మణ్ సలహాలు తీసుకున్నట్టు వెల్లడించారు. తమ మణికట్టుతో మాయచేసే బ్యాట్స్ మెన్ ను కలుసుకున్నానని అభివర్ణించారు.
మంత్రి కేటీఆర్ ను కలుసుకోవడం సంతోషంగా ఉందని కూడా లక్ష్మణ్ ట్వీట్ చేశారు. కేటీఆర్ డైనమిజం, విజన్, ఎనర్జీ తనను అమితంగా ఆకట్టుకున్నట్లు లక్ష్మణ్ ట్వీట్ లో చెప్పారు.
ఉత్తమ క్రీడా విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ యువతను మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దనున్నారు. ఈ నేపథ్యంలో మేటి క్రికెటర్ మంత్రి కేటీఆర్ను కలుసుకోవడం విశేషంగా మారింది.