తెలంగాణ కుర్రాడికి అమెరికా దొంగ వార్నింగ్ ఇదే

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అక్కడి పరిస్థితులు ఎంతలా మారాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ట్రంప్ మాటలతో కొందరు అమెరికన్లు అత్యాత్సాహాన్నిప్రదర్శించటం.. అతగాడి వివక్షను నరనరాన నింపుకునేటోళ్లు పెరిగిపోతున్నారు. ఇలాంటి వారిజాబితాలో దొంగలు కూడా చేరిపోవటం గమనార్హం. తాజాగా అమెరికాలో జరిగిన ఒక ఘటన సంచలనంగా మారింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడ్ని అమెరికా దొంగ ఒకరు బెదిరించి దొంగతానికి పాల్పడటమే కాదు.. దేశం విడిచి వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇవ్వటం గమనార్హం.

మంచిర్యాలకు చెందిన సామినేని భాస్కర్ రావు సింగరేణిలోని శ్రీరాంపూర్ లో టెక్నిషియన్ గా పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కొడుకులు (సాయి కిరణ్.. సాయి వరుణ్). వీరిద్దరూ ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. రెండేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి.. మిసిసిపి రాష్ట్రం క్లింటన్ సిటీలో ఉంటున్నారు. సాయి వరుణ్ ఎంఎస్ చదువుతూ షెల్ గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు.

అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8 గంటల వేళ గ్యాస్ స్టేషన్లోకి ప్రవేశించిన బ్లాక్ కలర్ ముసుగు దుస్తులు ధరించిన ఆగంతకుడు తుపాకీతో జొరబడి.. వరుణ్ ను లాకర్ ను ఓపెన్ చేయాలని బెదిరించాడు. ఆ సమయంలో మంచిర్యాలలో ఉన్న తల్లితో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ఆగంతుకుడు వచ్చి కొడుకును బెదిరిస్తునన వైనాన్ని లైవ్ లో చూసిన ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వరుణ్ తలకు తుపాకీ గురి పెట్టిన ఆగంతకుడు లాకర్ లోని డబ్బుల్ని దోచుకున్నాడు.

దొంగతనం ముగిశాక.. మా దేశాన్ని విడిచి వెళ్లిపో అంటూ పలుమార్లు తుపాకీని తలపై పెట్టి బెదిరించాడు. దీన్ని చూసిన వరుణ్ తల్లి జయలక్ష్మి తీవ్ర ఆందోళనకు గురై.. మరో కుమారుడు కిరణ్ కు ఫోన్ చేసి వివరాలు అందించారు. దీంతో.. అతడు తమ్ముడు దగ్గరకు వెళ్లాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఫిర్యాదు నమోదు చేసుకొని.. విచారిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఆ ప్రాంతంలో గడిచిన పద్నాలుగేళ్ల వ్యవధిలో ఎప్పుడూ చోటు చేసుకోలేదని చెబుతున్నారు. ఈ ఉదంతం నేపథ్యంలో అమెరికాలోని మనోళ్లు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *