మాయావతి రాజీనామా వెనుక భారీ వ్యూహం?
బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఆమె రాజీనామా వెనుక భారీ వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్ సభలో అడుగుపెట్టేందుకు వీలుగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాచేశారని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మాయావతి కోరుకుంటే బిహార్ నుంచి రాజ్యసభ సీటు ఇస్తానని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆమెకు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. మాయావతికి పూర్తి మద్దతు ఇస్తామని భరోసా ఇచ్చారు.
కాగా మంగళవారం రాజ్యసభలో దళితుల అంశంపై మాట్లాడేందుకు తనను అనుమతించలేదనే కారణంతో మాయావతి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. యూపీలోని సహరన్ పూర్ లో దళితులపై దాడి అంశాన్ని ఆమె ప్రస్తావించబోయారు. ఆమెను సభాపతి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన మాయావతి సభ నుంచి వాకౌట్ చేశారు. అదే రోజు సాయంత్రం రాజీనామా సమర్పించారు.
కాగా త్వరలో అలహాబాద్ కు సమీపంలోని ఫూల్పూర్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలో మాయావతి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా తన పదవికి రాజీనామా సమర్పించారని భావిస్తున్నారు. ఈ ఏడాది యూపీ ఎన్నికల్లో బీఎస్పీ కేవలం 18 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడనున్న మహా కూటమిలో భాగ స్వామి అయ్యేందుకు మాయావతి వేగంగా పావులు కదుపుతున్నారు.
యూపీలో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు లాలూ యత్నిస్తున్నారు. అందులో భాగంగానే యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ – మాయావతిల మధ్య స్నేహబంధం చిగురించేలా లాలూ చొరవ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ దిశగా లాలూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆగస్టు 27న పట్నాలో నిర్వహించనున్న ర్యాలీకి మాయావతి – అఖిలేశ్ ను లాలూ ఆహ్వానించారు.