కోడి మాంసంతో వైరస్ వ్యాపిస్తుందని వాట్సాప్లో….
చెన్నై; చైనాలో‘కోవిడ్-19’ ఈ వైరస్ కారణంగా 2 వేల మందికి పైగా మృతులైనారు. మన దేశంలో ఈ వైరస్తో ఇప్పటివరకు ఎవరు మృతిచెందలేదు, ప్రజల్లో మాత్రం వైరస్పై భయాందోళనలు కలిగాయి. కడలూరు జిల్లా నైవేలి ప్రాంతంలోని చికెన్ దుకాణంలో బ్రాయిలర్ కోడి మాంసం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని వాట్సాప్లో వదంతులు వ్యాపించాయి. దీంతో, కోడి మాంసం విక్రయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా, నైవేలి ప్రాంతంలోని కోడి మాంసం దుకాణ యజమాని ఫకృద్ధీన్ దుకాణంలో ఈ వైరస్ సోకిన కోళ్లను విక్రయిస్తున్నట్లు వాట్సాప్లో మెసేజ్లు హల్చల్ సృష్టించాయి. దీంతో దిగ్ర్భాంతి చెందిన ఫకృద్ధీన్ నైవేలీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేపట్టారు. కాగా రెండు వారాల కిందట ఫకృద్ధీన్ దుకాణానికి సుబ్రహ్మణ్యం కుమారుడు శక్తివేల్ (15) మాంసం కొనుగోలుకు వచ్చాడు. అప్పుగా మాంసం ఇవ్వాలని అతడు కోరగా ఫకృద్ధీన్ తిరస్కరించాడు. దీంతో అతడి వ్యాపారాన్ని దెబ్బ తీసేందుకు శక్తివేల్ ఫకృద్ధీన్ దుకాణంలో వైరస్ సోకిన కోళ్లను విక్రయిస్తున్నట్లు వాట్సాప్లో వదంతులు సృష్టించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రజల్లో అనవసర భయాందోళనలకు గురిచేసిన శక్తివేల్ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచి జువెనల్ హోంకు తరలించారు.