కేసీఆర్ దత్త కుమార్తె ఇప్పుడేం చేస్తుందంటే..

కొన్ని అంశాల విషయంలో ఊహించని రీతిలో రియాక్ట్ కావటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే. ఆ మధ్యన సవతితల్లి చేతిలో చిత్ర హింసలు అనుభవిస్తున్న ప్రత్యూష అనే యువతి ఉదంతం టీవీ ఛానళ్లలో జోరుగా ప్రసారం కావటం తెలిసిందే. ఈ ఉదంతం తెలుగు రాష్ట్రాల ప్రజల్ని విపరీతంగా కదిలించింది. ఆమెకు సాయం చేసేందుకు.. అండగా నిలిచేందుకు పలువురు ముందుకు వచ్చారు. ఇలాంటి వేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి.. ఆమెను తన దత్త పుత్రికగా ప్రకటించారు.

ఆమెకు సంబంధించిన అన్ని బాగోగులు తాను చూస్తానని చెప్పటమే కాదు.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆమె కోలుకున్నాక ఇంటికి పిలిచి.. భోజనం పెట్టి ఆమేం చేయాలనుకుంటున్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాను నర్సింగ్ కోర్సు చేయాలన్న అభిలాషను ఆమె వ్యక్తం చేయగా కేసీఆర్ ఓకే అన్నారు.

ఆమె ఏం కోరుకుంటే అది చదివిస్తామని.. ఆమె బాగోగులన్నీ తానే చూస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత నుంచి ఆమెకు సంబంధించిన అన్ని అంశాల్ని చూస్తున్నారు. తాజాగా ప్రత్యూష తాను కోరుకున్నట్లే నర్సింగ్ కోర్సులో చేరింది.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాజాగా చెప్పారు. దత్తపుత్రిక లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకున్న ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఆమెకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించటంతో పాటు.. ఆమె కోరుకున్న కోర్సు చేస్తున్నారు. అధికారుల సంరక్షణలో ఆమె ఇప్పుడు ఉన్నారు. ఆ మధ్యన ప్రత్యూష.. కర్నూలుకు చెందిన ఒక యువకుడ్ని ప్రేమించిందని.. అతడ్ని పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ముందు చదువు మీద దృష్టి పెట్టాలంటూ కేసీఆర్ సూచన చేసినట్లుగా అప్పట్లో అనుకున్నారు. మిగిలిన ముచ్చట్లు ఎలా ఉన్నా.. తానుకోరుకున్న నర్సింగ్ కోర్సు చేస్తున్న ప్రత్యూష మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *