గర్భిణీ అని కూడా చూడకుండా.. ఎన్నారై భర్త చిత్రహింసలు
హైదరాబాద్: పెద్దలు కుదర్చిన వివాహంతో వారిద్దరు ఒకటయ్యారు. అతను అమెరికాలో పనిచేస్తుండటంతో పెళ్లి తర్వాత భార్యను కూడా అమెరికా తీసుకెళ్లాడు. అయితే తల్లి మాటలను విని భార్యను నిత్యం వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. చివరకు గర్భంతో ఉందని కూడా చూడకుండా ఆరు నెలల బాబును, భార్యను ఎయిర్ పోర్టులో వదిలివెళ్లిపోయాడు. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. హైదరాబాద్ రామంతాపూర్ కు చెందిన యాలాల సాయి రెడ్డికి సూర్యపేట జిల్లా కోదాడ కు చెందిన శిరిషకి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహానంతరం సాయిరెడ్డి భార్యను కూడా తనతో పాటు అమెరికా తీసుకెళ్లాడు.
అక్కడ తల్లి చెప్పుడు మాటలు విని భార్య చిత్రహింసలకు గురిచేశాడు. ఇదే క్రమంలో ఈ నెల 15న భార్యను, ఆరు నెలల బాబును అమెరికా నుంచి తీసుకొచ్చి శంషాబాద్ విమానశ్రయంలో వదిలివెళ్లాడు. దీంతో నిస్సహాయ స్థితిలో శిరీష పోలీసులను ఆశ్రయించగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో చివరకు ఆమె బాలల హక్కుల సంస్థను ఆశ్రయించింది.
తన భర్త తనతో కాపురం చేసేలా చూడాలని, తల్లి చెప్పుడు మాటల వల్లే అతనలా ప్రవర్తిస్తున్నాడని శిరీష పేర్కొంది. శిరీష ఫిర్యాదుపై బాలల హక్కుల సంస్థ ప్రతినిధులు స్పందించారు. పుట్టిన బిడ్డకు తల్లి పాలు పట్టనివ్వకుండా బాబుని తల్లి నుంచి వేరు చేసిన భర్త, అత్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.