క్రికెటర్ శ్రీశాంత్ కు ఊరట
టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. అతనిపై ఉన్న జీవిత కాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదిస్తూ బీసీసీఐ అంబుడ్స్ మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆరేళ్ల శిక్ష అనుభవించిన శ్రీశాంత్కు 2020 ఆగస్టులో విముక్తి లభించనుంది. రాజస్థాన్ రాయల్స్కు ఆడుతున్న అతడిపై 2013 ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. తనపై నిషేధం ఎత్తివేయాలని శ్రీశాంత్ న్యాయ పోరాటానికి దిగాడు. దిగువ కోర్టుల్లో, కేరళ హైకోర్టులోనూ ఊరట లభించినా బీసీసీఐ మళ్లీ మళ్లీ పై కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 15న సుప్రీం కోర్టు అతడిపై నిషేధం తొలగించింది. శిక్ష తగ్గించి న్యాయం చేయాలని బీసీసీఐ అంబుడ్స్ మన్ను ఆదేశించింది. ప్రస్తుతం అతడికి 36 ఏళ్లు. కేరళ తరఫున, విదేశీ లీగుల్లో ఆడాలని అతడు కోరుకుంటున్నాడు.