ఫిబ్రవరి 17 ఇకపై ప్రతి సంవత్సరం రైతు దినోత్సవం గా….
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు (ఫిబ్రవరి 17)న ఇకపై ప్రతి సంవత్సరం రైతు దినోత్సవాన్ని నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ వ్యవసార రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, అందుకే కేసీఆర్ జన్మదినం రోజున రైతు దినోత్సవాన్ని నిర్వహించ తలపెట్టామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ పుట్టినరోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన మంత్రి నిరంజన్ రెడ్డి.. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. కంది రైతులు ఆందోళన చెందవద్దని సీఎం చెప్పారని, కేంద్రం 47 వేల 500 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని చెబితే.. తెలంగాణలో 2లక్షల మెట్రిక్ టన్నుల కంది ఉత్పత్తి అయ్యిందని తెలిపారు మంత్రి. మిగిలిన కందిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కేసీఆర్ ఆదేశించారని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అయితే.. కొనుగోళ్ళలో దళారులకు సహకరించే ఉద్యోగులను జైలుకు పంపుతామని హెచ్చరించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తిరోగమన విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విదేశీ మారక ద్రవ్యాన్ని అందించే పసుపు రైతులను ప్రోత్సహించక పోవడం తగదని, పసుపు బోర్డు బాధ్యత కేంద్రానిదేనని నిరంజన్ రెడ్డి అంటున్నారు.