వీరభద్రుడి దర్శనానికి సీఎం కేసీఆర్
వరంగల్ భద్రకాళీ అమ్మవారికి, తిరుమల వెంకన్నకు తెలంగాణ రాష్ట్ర మొక్కులు చెల్లించిన సీఎం కేసీఆర్ ఇవాళ కురవి వీరభద్రస్వామికి మొక్కు చెల్లించేందుకు మహబూబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కురవి వీరన్నకు బంగారు మీసాల మొక్కును చెల్లించనున్నారు. మహా శివరాత్రి కూడా కావడంతో వీరన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తారు.
ఉదయం హెలికాప్టర్లో బేగంపేట నుంచి బయలుదేరి 9.15 గంటలకు మేడ్చల్ జిల్లా కీసర చేరుకుంటారు. అనంతరం రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడినుంచి హెలికాప్టర్లో మహబూబాబాద్ జిల్లా కురవికి వెళ్తారు. అక్కడ వీరభద్రస్వామి దేవాలయంలో బంగారు మీసాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. అక్కడినుంచి ఉగ్గంపల్లికి రోడ్డు మార్గంలో వెళ్తారు. అక్కడ మధ్యాహ్న భోజనం చేసి తిరిగి కురవికి చేరుకుంటారు. తిరిగి అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి హైదరాబాద్కు చేరుకుంటారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కురవి వీరభద్రస్వామికి బంగారు కోరమీసాలు సమర్పిస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 2001లో మొక్కుకున్నారు. తెలంగాణ కల సాకారం కావడంతో మొక్కు చెల్లించుకునేందుకు శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కురవికి వెళ్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా, జేసీ దామోదర్రెడ్డి, డీఐజీ రవివర్మ, జిల్లా ఇన్చార్జి ఎస్పీ భాస్కరన్, ఆర్డీవో భాస్కర్రావు, తహసీల్దార్ సంజీవ విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యేలు సత్యవతిరాథోడ్, మాలోతు కవిత, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.