నిత్యానంద స్వామి వెంట ఇద్దరు టీనేజీ అమ్మాయిలున్నారు
వివాదాల వీరుడు స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇద్దరు టీనేజీ అమ్మాయిల్ని వశపరుచుకుని వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తున్నాడంటూ జనార్దన్ శర్మ అనే వ్యక్తి అతడిపై కోర్టుకెక్కాడు. ఈ కేసు విచారణ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.
చాలా ఏళ్ల కిందట సినీ నటి రంజితతో సరస సల్లాపాలు సాగిస్తూ వీడియోకు దొరికిపోయి అభాసుపాలైన నిత్యానంద.. ఆ తర్వాత మరెన్నో సందర్భాల్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ ప్రాంతంలో ఒక దీవిని కొనుక్కుని దానికి కైలాసం అని పేరు పెట్టి తనకు తానుగా దానికి అధిపతిగా ప్రకటించుకోవడం ద్వారా నిత్యానంద వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే..ప్రస్తుతం నిత్యానంద ఆ కైలాసంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అతడి వెంట ఇద్దరు టీనేజీ అమ్మాయిలున్నారు. మా నిత్యానందిత, మా తట్టువప్రియ పేర్లతో నిత్యానంద దగ్గర ఉంటున్న ఆ ఇద్దరు అమ్మాయిలు తమ కుమార్తెలని.. నిత్యానంద వారిని తప్పుదోవ పట్టించాడని.. వారిని తన వద్దకు చేర్చాలని కోరుతూ జనార్దన్ శర్మ కోర్టుకు ఎక్కాడు. ఈ కేసు విచారణ సందర్భంగా ఆ ఇద్దరు అమ్మాయిలు వీడియో ద్వారా లైన్లోకి వచ్చారు.తాము పూర్తి ఇష్టంతోనే నిత్యానందతో పాటు కైలాసంలో సంతోషంగా ఉన్నామని.. తమకు తండ్రి నుంచే ప్రాణ హాని ఉందని వాళ్లు ప్రత్యారోపణలు చేయడం గమనార్హం. కోర్టు వారి వాదనతో అంగీకరించలేదు. వాళ్లు ఏ దేశంలో ఉన్నప్పటికీ సంబంధిత ఎంబసీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఐతే ఆ ఇద్దరు అమ్మాయిలు తమ తండ్రిపై ఆరోపణలు గుప్పిస్తూ ప్రత్యేకంగా మరో వీడియోను రిలీజ్ చేయడం గమనార్హం.