1500కిలోల హెరాయిన్ పట్టివేత..!
కోట్ల విలువైన మాదకద్రవ్యాలను గుజరాత్ తీరంలో భద్రతా దళాలు పట్టుకున్నాయి. 1500కిలోల హెరాయిన్తో ఉన్న పనామాకు చెందిన వాణిజ్య నౌక ఎంవీ హెన్రీని గుజరాత్ తీరంలో ఆదివారం సిబ్బంది పట్టుకున్నారు.
దీని విలువ రూ. 3500కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. గుజరాత్ తీర ప్రాంతంలో మూడురోజులుగా భద్రతా సిబ్బంది గస్తీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వాణిజ్య నౌక అనుమానాస్పదంగా ఉండటాన్ని గమనించిన అధికారులు దాన్ని పట్టుకుని పోరుబందర్కు తీసుకొచ్చారు.
దేశంలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను సీజ్ చేయడం ఇదే తొలిసారి. ఈ ఘటనపై ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇంటెలిజెన్స్ బ్యూరో, పోలీసులు, కస్టమ్స్ అధికారులు, నావికాదళం వేరువేరుగా విచారణ ప్రారంభించాయి. కాగా, ఈ ఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
వీరంతా భారతీయులేనని సమాచారం. కోస్ట్ గార్డ్ ఆధీనంలో ఉన్న వాణిజ్య నౌక ఎంవీ హెన్రీ పేరుతో పనామా దేశంలో రిజిస్టర్ అయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంతకీ ఈ డ్రగ్స్ను దేశంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా?.. పనామా రిజిస్టర్డ్ నౌక భారత జలాల్లో ఏం చేస్తుంది? అనే విషయాలపై ఇంకా అధికారులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.