22న చందమామపైకి చంద్రయాన్-2
శ్రీహరికోట: భారత అంతరిక్షా పరిశోదన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా గత పదేళ్ళపాటు కఠోర శ్రమతో చేపట్టిన చంద్రయాన్-2 రాకెట్ ఈ నెల 22వ తేదిన మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఈ ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అసలు చంద్రయాన్-2ను ఈ నెల 15వ తేదిన ఉదయం 2.5గంటలకు నింగిలోకి పంపించాల్సి ఉంది. కానీ రాకెట్ లోని సాంకేతిక లోపం కారణంతో ఆదివారం అర్థరాత్రి ప్రయోగాన్ని 56.24 నిమిషాల ముందు నిలిపివేసిన సంగతి తెలిసిందే.
జీఎస్ఎల్ మార్క్3–ఎం1 రాకెట్లోని క్రయోజనిక్ దశలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సవరించి మళ్లీ ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. క్రయోజనిక్ దశలోని గ్యాస్ బాటిల్స్(పోగో బాటిల్స్) నుంచి ట్యాంకుకు వెళ్లే పైపులు బయట నుంచి లీకేజీ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు 15వ తేదీ రాత్రి నుంచి నిద్రాహారాలు మాని క్రయోజనిక్ దశలో ఉన్నటువంటి 25 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనాన్ని వెనక్కి తీసేశారు. అనంతరం ట్యాంకులోని ఇంధనపు పొరలు తొలగించేందుకు నైట్రోజన్ వ్యాపర్స్ను లోనికి పంపి క్లీనింగ్ చేసే ప్రక్రియను వేగవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగం ఏడాది చివరి వరకు పడుతుందని మొదట అంచనా వేశారు కానీ, ఈ సాంకేతిక లోపాన్ని పూర్తిగా సవరించి వారం రోజుల గడువులోనే మళ్లీ ప్రయోగానికి సిద్ధం చేయడం ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి నిదర్శనం.