ఈమే జయలలిత కూతురంటూ ప్రచారం: నిజమేంటి?

చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూతురంటూ ఓ మహిళ ఫొటో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ మహిళ జయలలిత కూతురని, సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారని, ప్రస్తుతం అమెరికాలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంటున్నారని చెబుతూ పలు వాట్సప్ గ్రూపులు, ఫేస్‌బుక్‌లలో షేర్ అవుతోంది.

అయితే, ఆ మహిళకు, జయలలితకు ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది. ప్రముఖ గాయని, డబ్బింగ్ కళాకారిణి శ్రీపాద చిన్మయి.. సదరు మహిళ గురించిన వివరాలను తెలిపి సోషల్ మీడియా ప్రచారానికి తెరదించారు. వాస్తవానికి ఇదే ఫొటో 2014 నుంచే ఇలా తిరుగుతోంది.

అప్పట్లో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు తొలిసారి ఈ ఫొటో బయటకు వచ్చింది. అప్పట్నుంచి ప్రశ్నార్థకంగా ఉన్న ఈ ఫొటో చిన్మయి ఫేస్‌బుక్ వేదికగా స్పందించడంతో నిజమైన సమాధానం దొరికినట్లయింది.

చిన్మయి తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ పేరు దివ్యా రామనాథన్‌ వీరరాఘవన్. జయలలిత కూతురు కానే కాదు. ఆమె ఆస్ట్రేలియాలో తన భర్తతో కలిసి నివిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలకు, ఆమెకు ఏమాత్రం సంబంధం లేదు. వాళ్లు తన కుటుంబానికి చాలా బాగా తెలిసిన వాళ్లని, మంచి శాస్త్రీయ సంగీత కుటుంబం నుంచి వచ్చారని చిన్మయి తెలిపింది. అంతేగాక, ప్రముఖ మృదంగ విద్వాన్ వి.బాలాజీ కుటుంబానికి చెందినవారని వివరించింది. ఆయన కచేరీలు అంతగా బిజీగా లేనప్పుడు ప్రముఖ వెబ్ సిరీస్ ‘హజ్‌బ్యాన్‌డ్’లో నటిస్తారని కూడా తెలిపింది. కాగా, చిన్మయి ఇచ్చిన స్పష్టతతో ఆ ఫొటో ఎవరిదన్న చాలా మంది ప్రశ్నకు సమాధానం దొరికింది. అయితే, పలువురు మాత్రం ఈ సమాచారం కూడా సరైనదో కాదో అంటూ సందేహాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *