ఆగస్టు 30న సొంతగడ్డపైనే గేల్ రిటైర్మెంట్
ప్రపంచకప్ తర్వాత సొంతగడ్డపై భారత్తో జరిగే సిరీస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి వెస్టిండీస్ డాషింగ్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ రిటైరవ్వనున్నాడు. ఆగస్టు 30న తన సొంత నగరమైన జమైకాలోని కింగ్స్టన్లో జరిగే టెస్టుతోనే గేల్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను ముగించే అవకాశముంది. ప్రపంచకప్ తర్వాతే వీడ్కోలు పలుకుతానని గత నెల ప్రకటించినా.. మనసు మార్చుకున్నాడు 39ఏళ్ల గేల్. ఈ విషయాన్ని భారత్తో మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించాడు. ప్రపంచకప్ తర్వాత నా ప్రణాళిక అంటే.. నేను కచ్చితంగా భారత్లో ఓ టెస్టు మ్యాచ్ ఆడతా.. వన్డేలోనూ తలపడతా. ఇక టీ20లు ఆడను. ఇదే నా ప్లాన్ అని గేల్ చెప్పాడు. అనంతరం గేల్ రిటైర్మెంట్ సమాచారాన్ని విండీస్ మీడియా మేనేజర్ ఫిలిప్ స్పూనర్ ధ్రువీకరించారు. అవును, క్రిస్ తన చివరి సిరీస్ను భారత్తో ఆడనున్నాడు అని ప్రకటించాడు. ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియా.. విండీస్లో పర్యటించనుంది. ఆతిథ్య జట్టుతో మొత్తం మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. వీటిలో తొలి టీ20లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనున్నాయి.