బీసీసీఐ లో ధోనీ పేరు లేదు
ముంబయి: బీసీసీఐ(ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) గురువారం భారత క్రికెటర్ల(సీనియర్ మెన్స్ క్రికెటర్స్) వార్షిక ఒప్పందాలనుప్రకటించింది. ధోనీ అభిమానులకు బీసీసీఐ షాకిచ్చింది. ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాను ధోనీ పేరు లేకుండానే విడుదల చేసింది. 2019-2020 సంవత్సరానికి గానూ 27 మంది సభ్యులతో కూడిన కాంట్రాక్టు లిస్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో ధోనీ పేరు లేదు. దీంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటన త్వరలో వెలువడనుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. గత ఏడాది వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా ఓడిపోయినప్పటి నుంచి.. ఆటకు ధోనీ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచే క్రికెట్కు గుడ్ బై చెప్పేస్తాడన్న వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిపై ధోనీ ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ధోనీతో మాట్లాడిన తర్వాతే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని తెలుస్తోంది. రిటైర్ అవుతానని బీసీసీఐ పెద్దలకు ధోని చెప్పినట్లు సమాచారం. అందుకే బీసీసీఐ కాంట్రాక్టులో చోటు ఇవ్వలేదని చెబుతున్నారు.
ఏ+ కాంట్రాక్టులో కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా ఉండగా.. గ్రేడ్ ఏలో అశ్విన్, జడేజా, భువనేశ్వర్, పుజారా, రహానే, రాహుల్, ధవన్, షమి, ఇషాంత్, కుల్దీప్, పంత్ ఉన్నారు.
ఇక బీ గ్రేడ్లో సాహా, ఉమేశ్, చాహల్, పాండ్యా, మయాంక్… సీ గ్రేడ్లో జాదవ్, సైనీ, చాహర్, మనీశ్ పాండే, విహారీ, శ్రేయాస్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు.