జై లవకుశ’లో ఐదో పాట ముచ్చట్లు

‘జై లవకుశ’ ఆడియోలో నాలుగు పాటలే ఉండటం అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. ఆ నాలుగు పాటల ఆడియో కూడా మరీ గొప్పగా ఏమీ లేదు. రావణా.. పాట ఒక్కటి కొంచెం ఇంటెన్స్ గా అనిపించింది. నీ కళ్లలోన.. పాట కూడా పర్వాలేదు. మిగతా రెండు పాటలు చాలా మామలుగా అనిపించాయి. ఎన్టీఆర్ గత రెండు సినిమాలకు పాటలు ప్రత్యేక ఆకర్షణ అయ్యాయి. ఆ పాటల్ని కంపోజ్ చేసిన దేవిశ్రీ ప్రసాదే.. ‘జై లవకుశ’కు కూడా మ్యూజిక్ ఇచ్చాడు. దీనికి వచ్చేసరికి దేవిశ్రీ నిరాశ పరిచాడు. ఆ రెండు ఆడియోల్ని.. దీన్ని పోల్చి చూసిన జనాలు.. పిండే  కొద్దీ రొట్టె అన్నట్లుగా కంటెంట్ ను బట్టే ఇలాంటి ఆడియో ఇచ్చాడేమో.. అతణ్ని హడావుడి పెట్టేశారేమో అన్న సందేహాలు కూడా వ్యక్తం చేశారు.

ఐతే సినిమాలో నాలుగు పాటలే ఉంటే ప్రేక్షకులు నిరాశ చెందుతారని భావించి.. ఇంకో పాట జోడించడానికే ‘జై లవకుశ’ టీం నిర్ణయించుకున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాటనే ఎన్టీఆర్-తమన్నాల మీద చిత్రీకరించారు. ఈ పాటకు సంబంధించిన విశేషాల్ని ట్విట్టర్లో ‘జై లవకుశ’ సహ రచయిత కోన వెంకట్ పంచుకున్నాడు. ఇప్పటిదాకా బయటికొచ్చిన పాటల కంటే ఐదో పాట బాగుంటుందని.. అది కిల్లర్ సాంగ్ అని.. ఎన్టీఆర్ అందులో బెస్ట్ లుక్ తో కనిపిస్తాడని.. ఎన్టీఆర్ కెరీర్లోనే ఈ పాటే డ్యాన్స్ పరంగా ది బెస్ట్ అని.. నమ్మశక్యం కాని విధంగా ఉంటుందని తీర్పిచ్చేశాడు కోన. ఈ మాటలు అభిమానుల్లో ఉత్సాహం తెచ్చేవే కానీ.. అదే సమయంలో ఇప్పటికే విడుదలైన పాటల్లో కిక్కు లేదన్న విషయాన్ని అంగీకరిస్తూ.. అభిమానుల్ని సంతృప్తిపరచడానికి మరో పాట జోడిస్తున్నట్లు చెబుతున్నట్లుగా ఉన్నాయి ఈ ముచ్చట్లు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *