భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం: మరో 48గంటలు
భారత ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం ముంబై వాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. లోకల్ రైళ్లను రద్దు చేశారు. విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు నడుములోతు నీళ్లలో మునిగిపోయాయి. దీనికితోడు రానున్న 48 గంటల్లో కుంభవృష్టి కురవనున్నదన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ముంబై వాసులను మరింత భయాందోళనలకు గురిచేస్తున్నది. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. భారీ వర్షాలతో సియోన్, దాదర్, ముంబై సెంట్రల్, కుర్లా, అంధేరీ, సాకినాక ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. ఇవాళ ఉదయం నుంచే ఆరు సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది.
అటు సముద్రం ఎగిసిపడుతున్నది. సోమవారం సాయంత్రం మూడున్నర మీటర్ల ఎత్తయిన అలలు రికార్డయ్యాయి. అయితే భారీ వర్షాలతో ముంబైకి తాగు నీరందించే నాలుగు రిజర్వాయర్లు పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతుండటం నగర వాసులను ఆనందానికి గురి చేస్తున్నది. వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదని అధికారులు స్పష్టంచేస్తున్నారు.
మరో 48గంటలు.. కాగా, భారీ వర్షాలతో ముంబైకి తాగు నీరందించే నాలుగు రిజర్వాయర్లు పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతుండటం నగర వాసులను ఆనందానికి గురి చేస్తోంది. మహారాష్ట్రలో మరో 24 నుంచి 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.