చైనాతో యుద్ధం వస్తే.. మా మద్దతు భారత్కే: జపాన్
సిక్కిం – టిబెట్ – భూటాన్ త్రికూడలి డోక్లామ్లో భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మరో అగ్రదేశం మనకు మద్దతు ప్రకటించింది. దుష్టబుద్ధి చైనాకు జపాన్ మద్దతివ్వడం లేదు. డోకలామ్ వద్ద చైనాతో ఏర్పడిన ప్రతిష్టంభనలో భారతదేశానికే సంపూర్ణ మద్దతును ప్రకటించింది. చైనా ఒకవేళ సైనిక చర్యకు పాల్పడితే తాము ఇండియా వెంట ఉంటామని ఇప్పటికే అమెరికా స్పష్టం చేయగా, తాజాగా జపాన్ కూడా బాసటగా నిలిచింది. క్షేత్ర స్థాయిలో యథాతథ స్థితిని ఏకపక్ష బలంతో ఏ దేశమూ మార్చజాలదని జపాన్ స్పష్టం చేసింది.
భారతదేశంలో జపాన్ రాయబారి కేంజి హిరమట్సు మాట్లాడుతూ డోకలామ్ ప్రాంతం విషయంలో భూటాన్, చైనా మధ్య వివాదం ఉందని, ఈ రెండు దేశాలు సరిహద్దు చర్చల్లో పాల్గొంటున్నట్లు తాము గుర్తించామని చెప్పారు. భూటాన్తో బారతదేశానికి అవగాహన ఒప్పదం ఉండటంతో ఈ ప్రాంతంలో భారతీయ దళాలు ఉన్నాయని తెలుసుకున్నట్లు వివరించారు.
జపాన్ కూడా చైనా బాధితురాలే. ఇరు దేశాల మధ్య ఒప్పందాలను చైనా ఉల్లంఘిస్తోంది. తూర్పు చైనా సముద్రంపై సార్వభౌమాధికారం విషయంలో చైనాతో జపాన్కు సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన దేశానికి జపాన్ మద్దతివ్వడాన్ని గొప్ప పరిణామంగా చెప్పవచ్చు.