జయలలిత క్రిటికల్: 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి వైద్యులు సోమవారం తాజాగా ఓ ప్రకటన చేశారు. జయలలితకు యాంజియోగ్రామ్ విధానం ద్వారా చికిత్సనందిస్తున్నామని వైద్యులు తెలిపారు. 24 గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచాలని వైద్యులు చెప్పారు.
జయలలిత త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేయాలని అపోలో వైద్యులు సూచించారు. మధ్యాహ్నం 12 గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నట్లు వైద్యులు ప్రకటించారు.
కాగా, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద 3000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు.
ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న హోటల్స్ను, దుకాణాలను ఖాళీ చేయించారు. సీఎం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి.74 రోజుల క్రితం సెప్టెంబరు 22వ తేదీన జయలలిత డీహైడ్రేషన్, తీవ్ర జ్వరంతో జయ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బీలే, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు జీసీ గిలాని (పల్మనరీ మెడిసిన స్పెషలిస్ట్), అంజన ట్రికా (అనస్తీషియాలజిస్ట్), నితీష్ నాయక్ (కార్డియాలజిస్ట్) (మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యక్తిగత వైద్యుడు), సింగపూర్ ఫిజియోథెరపీ నిపుణులు ఇచ్చిన చికిత్సతో ఆమె కోలుకుంటోందని అందరు భావించారు.