ఆ మంత్రి కోసం కేసీఆర్ వర్సెస్ కేటీఆర్
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్లో అంతర్గత కుమ్ములాటలు జోరందుకున్నాయి. బంగారు తెలంగాణ ఏర్పాటు లక్ష్యంలో భాగంగా జిల్లాల సంఖ్యను అనూహ్యంగా 31కి పెంచారు. దీంతో పార్టీలో చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులకు సైతం పదవులు లభించనున్నాయి. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షులను ఖరారు చేసే బాధ్యత తనకు వదిలేసి జిల్లా కార్యవర్గాలు, అనుబంధ సంఘాల కార్యవర్గాల జాబితాలు అందజేయాలని సీఎం కేసీఆర్ ఆయా జిల్లాల మంత్రులను ఆదేశించారు.
అయితే ఓ జిల్లా అధ్యక్ష పదవి విషయంలో ఇప్పుడు సీఎం కేసీఆర్ , ఆయన కుమారుడు మంత్రి అయిన కేటీఆర్ మధ్య వార్ జరుగుతోందట. అవిభాజ్య ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడి ఎంపికలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జలగం వెంకట్రావుల మధ్య పోటీ ఏర్పడటం, ఖమ్మం జిల్లా అధ్యక్ష పదవికి ప్రస్తుత అధ్యక్షుడు బేగ్ అయిష్టంగా ఉన్న కారణంగా పెండింగ్లో పడిందంటున్నారు.
ఈ రెండు జిల్లాల్లో ముఖ్యంగా కొత్తగూడెం విషయంలో మంత్రి తుమ్మల – ఎమ్మెల్యే జలగం మధ్య జరుగుతున్న వార్లో సీఎం కేసీఆర్ మంత్రి తుమ్మలకు సపోర్ట్గా ఉంటే, ఎమ్మెల్యే జలగంకు మంత్రి కేటీఆర్ సపోర్ట్ చేస్తున్నారట. ఇలా కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ వేర్వేరు వ్యక్తులకు సపోర్ట్ చేస్తుండడంతో కొత్తగూడెం రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.
ఫైనల్గా ఈ పోరు సీఎం కేసీఆర్ వద్దకు పంచాయితీ చేరినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో తుమ్మల తన ఆధిపత్యం నెగ్గించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఓ మంత్రి కోసం కేసీఆర్, కేటీఆర్ ఇలా వేర్వేరుగా సపోర్ట్ చేయడం టీ పాలిటిక్స్లో ఆసక్తిగా మారింది.