మహారాష్ట్రలో ఉద్రిక్తంగా మారిన రైతుల ఆందోళన
మహారాష్ట్ర థానె జిల్లాలో రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తమ భూములను ప్రభుత్వం అన్యాయంగా తీసుకుంటుందని ఆరోపిస్తూ.. భూసేకరణకు వ్యతిరేకంగా కల్యాణ్ లో రైతులు ఆందోళన చేపట్టారు. థానె హైవేపై ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టడంతో.. రాస్తారోకో ఉద్రిక్తంగా మారింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు, అదనుపు భద్రతా బలగాలను కల్యాణ్ కు తరలించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. థానే జిల్లాలో నావికా దళానికి చెందిన 12,600 ఎకరాల స్థలంలో గత కొన్నేళ్లుగా స్థానికులు నివసిస్తున్నారు. ఆ స్థలాన్ని తమకే ఇవ్వాలంటూఇటీవల రైతులు అధికారులను కోరారు. రైతుల వినతిని అధికారులు తిరస్కరించడంతో ఆందోళన చేపట్టారు. దాదాపు 17 గ్రామాలకు చెందిన రైతులు గురువారం 10 చోట్ల నిరసన చేపట్టారు. థానే-బద్లాపూర్ హైవేపై రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది.